ఖమ్మం : కేంద్రప్రభుత్వం తీరును నిరసిస్తూ తలపెట్టిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె రెండవ రోజు శుక్రవారం కూడా కొనసాగింది. ఫలితంగా రెండవ రోజున సైతం 12 రకాల జాతీయ ప్రభుత్వరంగ సంస్థల బ్యాకుల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో ఖాతాదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసే చ్టటం తీసుకువచ్చిన కేంద్ర సర్కార్ వైఖరిని నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగ సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. వైరా రోడ్లోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. ఉద్యోగులు చేపట్టిన నిరసనకు వామపక్ష పార్టీల నాయకులు మద్దతు తెలిపారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐఎంఎల్ నాయకుడు గోకినపల్లి వెంకటేశ్వరరావు, ఐఎఫ్టీయూ నాయకుడు రామారావు, యర్రా శ్రీకాంత్, బ్యాంకు ఉద్యోగుల సంఘం జాతీయ నాయకుడు కనకం జనార్థన్రావులు ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. మారుమూల గ్రామాల ప్రజలకు సేవలు అందిస్తున్న ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడం సరికాదన్నారు. కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం చేకూర్చేందుకు గాను బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు రాజేష్, శ్రీకాంత్, పీ నాగేందర్, కుమార్, సునీల్, టీ నందన్, చిన్నప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు.