న్యూఢిల్లీ: ప్రశ్న పత్రం రూపకర్త చిత్తశుద్ధి, విశ్వసనీయతలే పరీక్షల నిర్వహణలో అతి పెద్ద సవాలని పరీక్ష విధాన సంస్కరణలపై కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ సభ్యుడు, ఐఐటీ మద్రాసు డైరెక్టర్ వీ కామకోటి అన్నారు. గత నాలుగు దశాబ్దాలుగా పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, దీనివల్ల సాంకేతిక జోక్యం అత్యంత ఆవశ్యకమని అన్నారు.
ఏ పరీక్షా విధానంలోనైనా రెండు వర్గాల వ్యక్తులు విశ్వసనీయంగా ఉండాలి. మొదటిది ప్రశ్న పత్రాలను రూపొందించే వారు, రెండవది పరీక్షా కేంద్రాల్లో పర్యవేక్షకులు(ఇన్విజిలేటర్లు). ప్రశ్న పత్రాలను రూపొందించే వారి పట్ల విశ్వాసాన్ని పెంపొందించుకోవడం, నిలబెట్టుకోవడమే అతి పెద్ద సవాలు అని కామకోటి అభిప్రాయపడ్డారు.