న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన సోషల్ మీడియా ప్రచారం, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమం విజయవంతం కావడం ఇతర అంశాలపై కూడా కొత్త తరహా ఆన్లైన్ ఉద్యమాలకు ఊతమిచ్చినట్లు కనిపిస్తున్నది. ఇటీవల అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రచారాలలో ఒకటి రిజర్వేషన్ హటావో ఆందోళన్(ఆర్హెచ్ఏ). దేశంలో కుల ఆధారిత రిజర్వేషన్లను అంతం చేయాలని పిలుపునిస్తున్న ఈ ఉద్యమం ఇన్స్టాగ్రామ్ వేదికగా నడుస్తున్నది. దీని ఖాతా దాదాపు 50 లక్షల మంది ఫాలోవర్లను చేరుకుందని సమాచారం. దీంతో ఇది ఆ ప్లాట్ఫారమ్లో అత్యంత ప్రాచుర్యం పొందిన కొత్త సమస్య ఆధారిత డిజిటల్ ప్రచారాలలో ఒకటిగా నిలిచింది.
ఆర్హెచ్ఏ ప్రచారం ఏమిటి?
రిజర్వేషన్ హటావో ఆందోళన్ అనేది దేశంలో కుల ఆధారిత రిజర్వేషన్ను వ్యతిరేకించే ఒక సోషల్ మీడియా ప్రచారం. కళాశాలల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు కులం ఆధారంగా కాకుండా ప్రతిభ, మార్కులు, సామర్థ్యం ఆధారంగా జరగాలని ఈ ప్రచార మద్దతుదారులు వాదిస్తున్నారు. ఆర్థికంగా బలహీన వర్గాల నుండి వచ్చిన విద్యార్థులు, యువతకు ఆర్థిక సహాయం అందించాలని కూడా ఈ ప్రచార నిర్వాహకులు, మద్దతుదారులు కోరారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు చదువుకోవడానికి, తమ వృత్తిపరమైన జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి అవకాశాలు పొందేలా ప్రభుత్వ సహాయం అనేది ఆర్థిక అవసరాల ప్రాతిపదకన ఉండాలన్నది వారి వాదన.