మందమర్రి, డిసెంబర్ 25 : రామకృష్ణాపూర్, మందమర్రి మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం కావాల్సిన సింగరేణి భూములు రెవెన్యూశాఖకు అందించే ప్రక్రియ వేగవంతం చేయాలని చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కోరారు. హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో ఆదివారం చెన్నూర్ నియోజకవర్గంలోని సింగరేణి ప్రాంత సమస్యలపై సింగరేణి, ప్రభుత్వ అధికారులతో స మన్వయ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని చెన్నూర్, మందమర్రి, రామకృష్ణాపూర్లోని సింగరేణి ప్రాంత సమస్యలపై కూలంకషంగా చర్చించారు. ఇప్పటికే సింగరే ణి రెవెన్యూకు అప్పగించిన భూముల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, మహిళా భవన్, బతుకమ్మ గ్రౌండ్స్, కమ్యూనిటీ భవనాల నిర్మాణాలు శరవేగంగా కొససాగుతున్నాయన్నారు. ఇప్పటివరకు జీవో 76 ద్వారా రామకృష్ణాపూర్లో నాలుగు విడుతలుగా 1,972 మందికి సింగరేణి స్థలాల్లో ఇండ్లు కట్టుకున్నవారికి పట్టాలు పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. త్వరలోనే ఐదో విడుత ఇండ్ల పట్టాల పంపిణీ ఉంటుందని తెలిపారు.
బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణాపూర్ పట్టణాల్లో ఉన్న 8,252 క్వార్టర్లలో సింగరేణి అవసరాలు, కార్మికులకు సరిపడా కేటాయించగా మిగిలినవి, శిథిలావస్థలో ఉన్నవాటిని నిరుపేదలకు అందించడానికి సహకరించాలని కోరారు. క్వార్టర్ల కేటాయింపులో తొలి ప్రాధాన్యం రిటైర్డ్ సింగరేణి కార్మికులకు ఉంటుందని ప్రత్యేకంగా సూచించారు. ఈ విషయంలో కార్మికులు ఎలాంటి వదంతులు నమ్మవద్దని తెలిపారు. సింగరేణి ఏరియాల్లో నివాసముండే కార్మికేతర కుటుంబాలకు తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వంటి సౌకర్యాల కల్పనలో మానవతా దృక్పథంతో చూడాలని కోరారు.
సింగరేణి ఏరియాల్లో అదనంగా పార్కులు, చిల్డ్రన్స్ ప్లేగ్రౌండ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. సింగరేణి అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం వల్ల కార్మికులకు మెరుగైన సేవలు అందించడానికి దోహదపడుతుందన్నారు. ఈ సమావేశంలో సింగరేణి డైరెక్టర్( ఫైనాన్స్) బలరాం నాయక్, రామకృష్ణాపూర్, మందమర్రి మున్సిపల్ కమిషనర్లు జీ వెంకటనారాయణ, గద్దెరాజు, మందమర్రి తహసీల్దార్ శ్రీనివాస్, మందమర్రి జీఎం చింతల శ్రీనివాస్, శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి, మున్సిపల్, సింగరేణి అధికారులు పాల్గొన్నారు.