కొత్తగూడెం గణేష్ టెంపుల్, జూన్ 08 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాల అన్వేషణలో ఉన్న యువత కోసం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేష్ రెడ్డి రూపొందించిన ఈ క్లాస్ యాప్ను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. సోమవారం కొత్తగూడెం క్లబ్లో జరిగిన కార్యక్రమంలో రాకేష్ రెడ్డి రూపొందించిన ‘ఈ- క్లాస్ యాప్’ను ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారని తెలిపారు. అమలు గాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. ఉద్యోగాలు సాధించేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ యాప్ను వినియోగించుకుని ఉద్యోగాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ క్లాస్ యాప్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువత సద్వినియోం చేసుకోవాలని కోరారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ది అయితే రాష్ట్రాన్ని దివాలా తీసిన ఘనత రేవంత్ రెడ్డిది అని దుయ్యబట్టారు. అమలు గాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడం దారుణం అన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి సరైన రీతిలో బుద్ధి చెప్పాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మెచ్చ నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, మానే రామకృష్ణ, కొత్తగూడెం మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, మాజీ వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్, అనుదీప్, కిలారు నాగేశ్వరరావు, మంతపురి రాజు గౌడ్, కార్పొరేటర్లు సింధు తపస్వి, మల్లెల స్వప్న కుమారి, బత్తుల మధు, గుణ చరిత్ పాల్గొన్నారు.