కొత్తగూడెం గణేష్ టెంపుల్, జూన్ 01 : పోలవరం ముంపు బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు. సోమవారం బీఆర్ఎస్ జిల్లా కార్యవర్గంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 3 లేదా 4వ తేదీన జిల్లాకు రానున్న పోలవరం ప్రాజెక్టు అథారిటీ కమిటీ లోతుగా పరిశీలన చేసి ముంపు బాధితులకు న్యాయం చేయాలన్నారు. తూతూ మంత్రంగా సర్వే నిర్వహించే పాలకవర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. ముంపు ప్రభావంతో భద్రాచలం బూర్గంపాడు, పినపాక నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు జలమయ్యే ప్రమాదం ఉందన్నారు. పోలవరం ప్రాంత బాధితులకు ఆంధ్రాలో ఇచ్చిన పరిహారం కన్నా ఎక్కువ పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ముంపు కలవకుండా రక్షణ గోడలను నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు. పోలవరం ముంపు బాధితులకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. ముంపు బాధితులతో పాటు రైతులు యువత కార్మిక లోకాన్ని ఏకం చేసి పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగల రాజేందర్, మంతపురి రాజు గౌడ్, కొట్టి వెంకటేశ్వర్లు, మల్లెల రవిచంద్ర, సంకబాన అనుదీప్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, కార్పొరేటర్లు సింధు తపస్వి, మల్లెల స్వప్న కుమారి పాల్గొన్నారు.