– మంచాన్ని డోలీలా మార్చి 2 కిలోమీటర్లు మోసుకెళ్లిన గ్రామస్తులు
బూర్గంపహాడ్, ఏప్రిల్ 10 : అనారోగ్యంతో ఉన్న గర్భిణీకి ఎంత కష్టం వచ్చి పడిందో.. భద్రాచలం ఐటీడీఏకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న బూర్గంపహాడ్ మండలం మోతే పట్టీనగర్ పంచాయతీలోని ఆదివాసీ గిరిజన గ్రామం చింతకుంటకు చెందిన ఏడు నెలల గర్భిణీకి సుస్తి చేసింది. అయితే ఆ గ్రామానికి దారి సరిగ్గా లేక అంబులెన్స్ కూడా వెళ్లే వీలులేక పోవడంతో దీంతో భర్త మడవి నాగేష్, కుటుంబ సభ్యులు శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో గర్భిణీ మడవి సావిత్రిని మంచంపై పడుకోబెట్టి నాలుగు వైపులా తాడు కట్టి డోలీలా ఏర్పాటు చేసి భర్త, కుటుంబ సభ్యులు సుమారు రెండు కిలోమీటర్లు సెల్ఫోన్, టార్చిలైట్ల వెలుతురులో కాలినడకన మోసుకుంటూ ప్రధాన రహదారికి చేరుకున్నారు. అక్కడ అంబులెన్స్లో ఎక్కించి భద్రాచలం ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు.
ఈ గ్రామానికి వెళ్లడానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో అంబులెన్స్ వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఎంతో కష్టాన్ని అనుభవిస్తూ మంచాన్నే డోలీగా మార్చి ఆ నిండు గర్భిణీని ఆస్పత్రికి చేర్చే విషయంలో నానా తంటాలు పడ్డారు. అదే గ్రామంలో సమయానికి వైద్య సదుపాయం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలూ ఉన్నాయని… అంబులెన్స్ అయినా ఈ గ్రామానికి వచ్చే సదుపాయం ఉంటే ఎంతోమంది ప్రాణాలు దక్కేవని, ఆదివాసీ గిరిజనుల బతుకు మారేది లేదని ఆ గ్రామ గిరిజనులు వాపోతున్నారు. అయితే చింతకుంట, శ్రీరాంపురం ఎస్టీ కాలనీకి అనుసంధానంగా ఉండే 650 మీటర్ల గ్రావెల్ రోడ్డు విషయాన్ని ఐటీడీఏ అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధులు తీసుకువెళ్లినా నేటికీ గిరిజన గ్రామాల్లో రహదారి సౌకర్యాలు మెరుగు పడలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రావెల్ రోడ్డు ఏర్పాటు చేస్తే గిరిజనుల ప్రాణాలను కాపాడవచ్చని బాధిత గ్రామాల గిరిజనులు ముక్తకంఠంతో కోరుతున్నారు.

నిండు గర్భిణికి ఎంత కష్టం..