అశ్వారావుపేట:బషీర్బాగ్ విద్యుత్ అమరవీరులకు వామపక్షపార్టీల ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు. శనివారం పట్టణంలోని హమాలీ అడ్డాలో జరిగిన అమరువీరుల సంస్మరణ సభలో అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటి సభ్యులు పిట్టల అర్జున్ మాట్లాడుతూ రెండువేల సంవత్సరంలో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా ఆందోళన నిర్వహిస్తున్నవారిపై అమానుషంగా కాల్పులు జరిపించారని ఈ దుర్ఘటనలో పలువురు అమరులయ్యారని అన్నారు.
ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కొత్త విద్యుత్ చట్టం తీసుకువచ్చిందని దీనివల్ల విద్యుత్ చార్జీలు మరింత పెరిగి సామాన్యులకు గుదిబండగా మారనున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్షనాయకులు బి చిరంజీవి, ప్రభాకర్, రామకృష్ణ, ఏసు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.