భద్రాచలం: భద్రాద్రి రామయ్యను తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ శ్రీధర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.మంగళవారం రామయ్యను దర్శించుకునేందుకు ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ అధికారులు, అర్చకులు మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా ధ్వజస్థంభం వద్ద పూజలు నిర్వహించి, గర్భగుడిలోని మూలమూర్తుల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న భద్రుని కోవెల,లక్ష్మి తాయారమ్మ వారిని, ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో ఆయనకు అర్చకులు వేదాశీర్వచనం అందజేసి, స్వామివారి పట్టు వస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు.
స్వామివారిని దర్శించుకున్న తరువాత ఐటీసీ పీఎస్పీడీ వసతి గృహానికి చేరుకున్నారు. అక్కడ ఐటీసీ సిబ్బంది, గిరిజన సంక్షేమశాఖ కార్యాలయం అధికారులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట దేవస్థానం ఈఓ బానోత్ శివాజీ, ఆలయ ప్రధానార్చకులు అమరవాది విజయరాఘవన్, భద్రాచలం తహశీల్థార్ శ్రీనివాస్ యాదవ్, బూర్గంపాడు తహశీల్థార్ భగవాన్ రెడ్డి, భద్రాచలం ఏటీడీఓ నరసింహారావు, ఇల్లందు ఏటీడీఏ రూపాదేవి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.