భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 18 : మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతో పాటు మరో ఐదుగురిది ముమ్మాటికీ బూటకపు ఎన్కౌంటరేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్కౌంటర్ల పేరుతో నర హత్యలకు పాల్పడుతోందని, బూటకపు ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం కొత్తగూడెం స్థానిక సిపిఐ కార్యాలయం శేషగిరి భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసలు ఎన్కౌంటర్ అంటే ఇరుపక్షాలు ఎదురెదురుగా కాల్చుకునేదని, కానీ ప్రస్తుతం హిడ్మా ఎన్కౌంటర్ చూస్తుంటే వారిని పట్టుకుని తెచ్చి కాల్చి చంపినట్లుగా ఉందన్నారు. దానికి కట్టుకథ అల్లి ఎన్కౌంటర్ అనే అందమైన పేరు పెడుతున్నారని మండిపడ్డారు.
శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పటికీ పంతం పట్టి మరీ కాల్చి చంపుతున్నారన్నారు. 2026 మార్చి నెలాఖరు నాటికి మావోయిజాన్ని లేకుండా చేస్తామని చెప్పిన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన మాటకు సార్థకత చేకూరేలా ప్రవర్తిస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్కౌంటర్తో పాటు ఇప్పటివరకు చోటు చేసుకున్న ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించి న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా చూడాలని ఆయన అన్నారు. బూటకపు ఎన్కౌంటర్లు చేస్తూ దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టించడం సరైంది కాదన్నారు. ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే మంచిదే కానీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ కనీస అవకాశం ఇవ్వకుండా చేయడం మంచి పద్దతి కాదన్నారు.
దేశంలో బీజేపీ అరాచక పాలన సాగిస్తోందన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మొట్టికాయ వేశారని, బిహార్ ఎన్నికల్లో ఓట్ల గల్లంతుకు పాల్పడటంతో పాటు అయినవారి ఓట్లను కలుపుకుని విజయం సాధించినట్లు చెప్పుకుంటున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని, ఇది జంగిల్ రాజ్ పరిపాలనలా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా బూటకపు ఎన్కౌంటర్లు, మత గర్షణలకు, మతాలు, కులాల పేరుతో విభజనలకు స్వస్తి పలికి దేశంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు నలిగంటి శ్రీనివాస్, జి.వీరస్వామి, చండ్ర నరేంద్ర, వంట్టికొండ మల్లికార్జునరావు, గుండెపిన్ని వెంకటేశ్వరరావు, వంగా వెంకట్, రత్నకుమారి, నాగుల్ మీరా పాల్గొన్నారు.