Jitesh V Patil | భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 18 : పదవ తరగతి ఫలితాలు విద్యార్థుల భవిష్యత్ లక్ష్యాలు సాధించడానికి మార్గదర్శకాలు అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ (Jitesh V Patil) అన్నారు. ఇవాళ కొత్తగూడెం పట్టణంలోని అంబేద్కర్ భవన్ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ప్రేరణ, శిక్షణ తరగతులు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత కలెక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలనతో తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పదవ తరగతి ఫలితాల్లో ఎన్ని మార్కులు వస్తాయని విద్యార్థులు ఆలోచించకుండా వారి భవిష్యత్తు లక్ష్యాలను చేరుకోవడానికి కష్టపడి చదవాలని అన్నారు.
కేవలం పదవ తరగతి మాత్రమే ప్రామాణికంగా తీసుకోరాదని, పదవ తరగతి అనేది ఒక మెట్టు మాత్రమేనన్నారు. పదవ తరగతి తర్వాత అనేక కోర్సులు చేయాలని అన్నారు. నిరంతరం కష్టపడుతూ ఉంటే లక్ష్యాలను సాధించుకోవచ్చని అన్నారు. తాను కూడా విద్యార్థి దశలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని, పదవ తరగతి చదువుకునేటప్పుడు ఒక మంచి ఇంజినీర్ అవుదామని అనుకున్నాను..తర్వాత నా లక్ష్యాలను మార్చుకొని పట్టుదలతో చదివి ఐఏఎస్ సాధించానని తన అనుభవాన్ని విద్యార్థులతో కలెక్టర్ పంచుకున్నారు.
విద్యార్థులు ఒక మంచి జీవితం కోసం ప్రేరణ కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతోపాటు అన్ని రకాల పుస్తకాలు, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల కోసం ప్రత్యేక స్టడీ హవర్స్, ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను నియమించి నిపుణులతో ప్రేరణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
పరీక్షలకు కొన్ని రోజులే సమయం ఉన్నందున సమయాన్ని వృధా చేయవద్దన్నారు. విద్యార్థులు టీవీ, ఫోన్, సోషల్ మీడియా లాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. విద్యార్థులు సమన్వయంతో చదువుకోవాలన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సాధించాలని, హాస్టల్లో విద్యార్థులకు హాస్టల్ వార్డెన్లు ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహించి జిల్లాలో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా శిక్షణ అందించాలని కలెక్టర్ అన్నారు.
అనంతరం విద్యాశాఖ రిసోర్స్ పర్సన్ లు సైదులు, నాగరాజు శేఖర్, నాగరాజు, విజయ భాస్కర్, శ్యాం చందర్ రావులు విద్యార్థులకు శిక్షణ తరగతుల్లో వివిధ సబ్జెక్టుల్లో మెలకువలు నేర్పారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారిణి అనసూర్య, ఏఎస్డబ్ల్యూవోలు హనుమంతరావు, సునీత, హెచ్డబ్ల్యువోలు గజ్వేల్ శ్రీనివాస్, పద్మావతి, శశిరేఖ, కౌసల్య, రామ నరసయ్య, స్వప్న, కార్యాలయ సిబ్బంది నరసింహారావు, పార్వతి శశికళ, హేమంత్, సాయి తదితరులు పాల్గొన్నారు.
State Level Select | రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు కోటపల్లి ఆశ్రమ విద్యార్థిని ఎంపిక
Kothagudem | భార్యా పిల్లలను చూడ్డానికి అత్తగారింటికి వెళ్తే.. పెట్రోల్ పోసి నిప్పంటించారు