జూలూరుపాడు, సెప్టెంబర్ 01 : కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకంను వెంటనే రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. సీపీఎస్ అంతం – ఉద్యోగుల పంతం నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులంతా ముక్తకంఠంతో తమ నిరసన గళాన్ని వినిపించారు. ఈ సందర్భంగా వివిధ ఉపాధ్యాయ సంఘాల మండల, జిల్లా టీజీఈ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ప్రజా ప్రభుత్వంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని స్పష్టం చేశారు. గత మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న 6 డీఏలను వెంటనే విడుదల చేయాలని, నూతన వేతన సవరణ సంఘం పీఆర్సీ నివేదికను ప్రకటించి అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీయూఎస్ జిల్లా నాయకుడు బోడ కృష్ణతో పాటు పీఆర్టీయూ, యూటీఎఫ్, టీటీఎఫ్ మండల బాధ్యులు, ఉపాధ్యాయులు ఉమ, శాంతకుమారి, వెంకటేశ్వర్లు, జీవీఆర్ ప్రసాద్, అరుణకుమారి, లలిత, సునీత, సావిత్రి, ఉపేంద్రమ్మ పాల్గొన్నారు.