మణుగూరు రూరల్ : సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాకులను తమకు కేటాయించాలని విజ్ఞప్తులు చేస్తున్నా,పెడచెవిన పెడుతూ సింగరేణి పరిధిలోని కోయగూడెం ఓసీ-3, సత్తుపల్లి ఓసీ-3, మంచిర్యాల శ్రావణపల్లి ఓసీ, కేకేసీ అండర్ గ్రౌండ్ మైన్ల ఆక్షన్లో పెట్టడాన్ని టీబీజీకేఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్రావు అన్నారు. ఆయన ఇల్లెందు అతిథిగృహంలో టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు వీ.ప్రభాకర్రావు, లెవన్మెన్ కమిటీ మెంబర్ సామా శ్రీనివాసరెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. సింగరేణి కొత్తగూడెం-సత్తుపల్లి రైల్వే ట్రాక్, బొగ్గు నిక్షేపాలకు, గ్రేడ్ తదితర వివరాల కోసం సుమారు 80కోట్లకు పైగా ఖర్చు చేసిందన్నారు.
మొత్తం 88 బొగ్గు బ్లాకులలో సింగరేణి పెట్టుబడి పెట్టిన నాలుగు బొగ్గు బ్లాకులను కేంద్రం ఆక్షన్ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించాలనుకోవడం వల్ల సింగరేణికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. సింగరేణి పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఇప్పటికే అక్టోబర్ 28న నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపి అధికారులకు మెమోరాండం ఇవ్వడంతోపాటు, నవంబర్ 1న ధర్నా చేశామని మరో రెండు రోజుల్లో అన్ని ఏరియాలలో పర్యటించి కార్మికులను సమ్మెకు సన్నద్ధం చేస్తామని తెలిపారు. అనంతరం కేంద్ర కమిటీలతో చర్చించి తీర్మానం అనంతరం వారం రోజుల్లో సమ్మె నోటీసు ఇవ్వనున్నట్లు తెలిపారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు టీబీజీకేఎస్ పోరాడుతుందని టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్రావుపేర్కొన్నారు.