కొత్తగూడెం గణేష్ టెంపుల్, జూలై 23 : అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మచారి మాట్లాడుతూ కార్మికులకు ఇస్తామన్న రూ.10 వేలతోపాటు గ్యాస్ సిలిండర్లు, కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచడం లేదని, నెలల తరబడి ఆలస్యంగా వేతనాలు చెల్లిస్తున్నా విద్యార్థులకు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో కార్మికులు వండి పెడుతున్నారని తెలిపారు.
కార్మికుల సమస్యలను పరిషరించకుండా ఇంటిగ్రేటెడ్/ సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాలను ప్రోత్సహిస్తే వేలాది మంది విద్యార్థులు భోజనానికి దూరమవుతారని, కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని, లేదంటే పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్ నబీ, పిట్టల అర్జున్, శ్రీనివాస్, మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షురాలు పద్మ, కార్యదర్శి ఎస్.సుల్తాన, వెంకటనర్సమ్మ, రామలక్ష్మి, కుమారి, సమ్మక, శైలజ, రాణి, నజ్మా, శివకుమారి, అనసూయ, యామిని తదితరులు పాల్గొన్నారు.