రామవరం, జూలై 17 : వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సింగరేణి సంస్థ డైరెక్టర్ (పా) గౌతమ్ పోట్రు అన్నారు. గురువారం కొత్తగూడెం ఏరియాలోని సత్తుపల్లి జెవిఆర్ ఓ.సి, జెవిఆర్ సి.హెచ్.పి ని డైరెక్టర్ పా సందర్శించారు. ముందుగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలెం రాజు కొత్తగూడెం ఏరియా తరపున పూల మొక్కను బహుకరించి, శాలువాతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం జనరల్ మేనేజర్ క్యాంప్ కార్యాలయంలో జేవిఆర్ఓసి, కిష్టారం ఓసీ ఉపరితల గనుల మ్యాపుల ద్వారా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్, సంబంధిత ప్రాజెక్ట్ ఆఫీసర్లు ఉపరితల గనుల వివరాలను వివరించారు. ఈ సందర్భంగా జీఎం నూతనంగా అనుమతులు వచ్చిన ప్రాజెక్టు వికే ఓ.సి ఉపరితల మైన్ వివరాలను, వాటి రికార్డులను వివరించారు.
అనంతరం జెవిఆర్ ఓ.సి ని సందర్శించి వ్యూ పాయింట్ ద్వారా బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. రోజు వారి బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబి బ్లాస్టింగ్, లోడింగ్ పనులను జి.ఎం షాలెం రాజును అడిగి తెలుసుకున్నారు. అనంతరం బొగ్గు ఉత్పత్తి , రవాణా, రోజు వారి లక్ష్యాలను అధిగమించి రవాణాకు ఆటంకాలు కలుగకుండా ముందస్తు జాగ్రతలు తీసుకోవాలన్నారు. అనంతరం జేవిఆర్ ఓసి వ్యూ పాయింట్ వద్ద మొక్కలను నాటారు. జెవిఆర్ సి.హెచ్.పి లోడింగ్ పాయింట్ ను సందర్శించి సి.హెచ్. పి నందు రైలు మార్గం ద్వారా జరుగుతున్న బొగ్గు రవాణా గురించి, బంకర్ నుండి దుమ్ము ధూళి వెలవడకుండా తీసుకుంటున్న జాగ్రత్తలను పరిశీలించారు.
ఉత్పత్తి అయిన బొగ్గు రవాణా చేయాలని, బొగ్గు గ్రేడ్ లను పరిశీలించి నాణ్యమైన బొగ్గును సరఫరా చేయాలనీ సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిఎంతో పాటు ఎస్ ఓటు జిఎం జి.వి. కోటి రెడ్డి, ఏరియా ఇంజినీర్ కె.సూర్యనారాయణ రాజు, ప్రాజెక్ట్ ఆఫీసర్లు జేవిఆర్ ఓసి ఎన్.వి.ఆర్ ప్రహ్లాద్, కిష్టారం ఓసి ఎంవి. నరసింహారావు, జేవిఆర్ సి.హెచ్.పి డీజీఎం (ఈ&ఎం) కె. సోమశేఖర్, డీజీఎం (పర్సనల్) జి.వి. మోహన్ రావు, డీజీఎం (ఐఈడి) ఎన్.యోహాన్, కొత్తగూడెం ఏరియా ఇతర విభాగాల అధిపతులు, అధికారులు పాల్గొన్నారు.