– ఈగల్ ఫోర్స్ సీఐ హేమా రాణి పిలుపు
జూలూరుపాడు, మార్చి 12 : మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయని, యువత వీటికి దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్ను నిర్మించుకోవాలని ఈగల్ ఫోర్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హేమ రాణి పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో పోలీస్, ఈగల్ ఫోర్స్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ‘డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు’ నిర్వహించారు. ఆర్యవైశ్య కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి సీఐ హేమ రాణి మాట్లాడారు. డ్రగ్స్ వాడకం వల్ల గుండెపోటు, క్యాన్సర్, కాలేయం, ఊపిరితిత్తుల వ్యాధులు సంభవిస్తాయని, మెదడు పనితీరు మందగిస్తుందని తెలిపారు. మత్తుకు బానిసలైన వారిలో తీవ్ర ఆందోళన, డిప్రెషన్, ఆత్మహత్య ధోరణులు పెరుగుతాయని చెప్పారు. వ్యసనాల వల్ల కేవలం వ్యక్తే కాకుండా కుటుంబాలు రోడ్డున పడతాయని, ఆర్థికంగా, చట్టపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వెల్లడించారు.
ఎవరైనా డ్రగ్స్ తీసుకోమని బలవంతం చేసినా ధైర్యంగా ‘నో’ చెప్పే సంకల్పం విద్యార్థుల్లో ఉండాలన్నారు. అమూల్యమైన మానవ జీవితాన్ని మత్తు పదార్థాలతో పాడు చేసుకోవద్దని విద్యార్థుల చేత సీఐ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థులకు క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. కార్యక్రమం చండ్రుగొండ క్రాస్ రోడ్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, అక్కడ మానవహారంగా ఏర్పడి డ్రగ్స్ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, విద్యాశాఖ అధికారి బానోత్ జూంకిలాల్, పీహెచ్సీ వైద్యులు బానోత్ వెంకటేశ్వర్లు, ఎఫ్ఆర్ఓ ప్రసాదరావు, ఏఎస్ఐ శ్రీనివాసరావు, హెచ్ఎం లక్ష్మీ నర్సయ్య, నేతాజీ, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

‘మత్తుకు దూరంగా ఉంటూ ఉజ్వల భవిష్యత్ నిర్మించుకోవాలి’