కొత్తగూడెం అర్బన్, ఆగస్టు 29 : చదువుతో పాటు క్రీడలు కూడా విద్యార్థులకు ఎంతో అవసరమని, క్రీడలను కెరీర్గా ఎంచుకుని దేశానికి పేరు తెచ్చిన క్రీడాకారులు దేశంలో, రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. హాకీ మాంత్రికుడు, మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23 నుండి నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు శుక్రవారం పట్టణంలోని సింగరేణి స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ బహుమతులు అందజేసి మాట్లాడారు. ప్రతీ రోజు క్రీడల్లో సాధన చేస్తే ఏదో ఒక రోజు అద్భుతమైన విజయాలను సొంతం చేసుకోవచ్చన్నారు.
తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. క్రీడలను విజయవంతంగా నిర్వహించిన కోచ్ లను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో యువజన సర్వీసులు, క్రీడల జిల్లా అధికారి పరంధామరెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ యుగంధర్ రెడ్డి, జిల్లా స్పోర్ట్స్ సెక్రెటరీ నరేశ్, జిల్లా బాక్సింగ్ ప్రెసిడెంట్ ఎర్ర కామేశ్, టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు వై.వెంకటేశ్వర్లు, బాడ్మింటన్ సెక్రెటరీ సావిత్రి, వివిధ క్రీడల కోచ్లు పాల్గొన్నారు.