భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 27 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సికిల్సెల్, తలసేమియా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగుల కోసం నవంబర్ 28–29 తేదీల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బాధితులకు నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించాలన్న లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించడం, అవసరమైతే నిరంతర చికిత్సకు అనుసంధానం చేయడం, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడం ఈ శిబిరాల ప్రధాన ఉద్దేశం అని కలెక్టర్ వెల్లడించారు.
– 28వ తేదీ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు. నర్సాపురం రైతు వేదిక, దుమ్ముగూడెం
– 28వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. భద్రాచలం రైతు వేదిక (మార్కెట్ యార్డ్లో)
– 29వ తేదీ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు. అశ్వారావుపేట రైతు వేదిక (నారాయణపురం గ్రామ పంచాయతీ కార్యాలయం పక్కన) నారాయణపురం గ్రామం, అశ్వారావుపేట మండలం
– 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. రామవరం రైతు వేదిక, చుంచుపల్లి మండలం
హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా రానున్న నిపుణులైన వైద్యుల బృందం ఈ శిబిరాల్లో రోగుల నిర్ధారణ, వైద్య సలహాలు, అవసరమైన చికిత్స పద్ధతులు వివరించనున్నారు. సికిల్సెల్, తలసేమియా రోగులకు మెడికల్ కార్డుల జారీ, ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు నమోదు, కౌన్సిలింగ్ సేవలు పూర్తిగా ఉచితంగా అందించబడతాయని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే ఈ వ్యాధులు గుర్తించిన పిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలను సమీప శిబిరానికి తీసుకురావాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వైద్యుల సూచనలు పొందాలని కోరుతూ, రోగుల ఆరోగ్య రక్షణలో ప్రతి కుటుంబం చురుకైన పాత్ర వహించాలని కలెక్టర్ కోరారు.