- రామచంద్రాపురం కాల్వ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో రైతుల నిరసన
– ఇతర జిల్లాలకు నీటి తరలింపుపై స్థానిక ఎమ్మెల్యేల మౌనం తగదు
– నష్ట పరిహారం చెల్లించి, పిల్ల కాల్వల ద్వారా చెరువులను నింపాలని డిమాండ్
జూలూరుపాడు, జూలై 17 : సీతారామ ప్రాజెక్టు జలాలను జూలూరుపాడు మండలానికి పిల్ల కాల్వల ద్వారా తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రైతులు నిరసన చేపట్టారు. సీపీఎం గుండెపూడి, రామచంద్రాపురం శాఖల ఆధ్వర్యంలో రామచంద్రాపురం సమీపంలోని సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాల్వ కట్టపై ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల నాయకులు వి. చందర్ రావు, బానోత్ మధు, పద్దం సుగుణ మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సీతారామ ప్రాజెక్టు నీళ్లను ముందుగా ఈ జిల్లా రైతాంగానికి అందించాల్సిన కనీస బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. స్థానిక రైతుల అవసరాలు తీర్చకుండా ఇతర జిల్లాలకు నీటిని తరలించడం జిల్లాకు చేస్తున్న తీవ్ర ద్రోహమని వారు మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు ద్వారా తమ పొలాలకు సాగునీరు అందుతుందని, పంటలు పండుతాయని ఎన్నో ఆశలతో రైతులు తమ లక్షల విలువైన భూములను కాలువ నిర్మాణానికి త్యాగం చేశారని గుర్తుచేశారు.
కళ్ల ముందే తమ భూముల్లోంచి నీళ్లు పారుతున్నా.. ఆ నీరు తమకు దక్కకపోవడం రైతులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందన్నారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా జూలూరుపాడు మండల రైతుల పరిస్థితి మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలోనే సాగునీటి సదుపాయం లేని ఏకైక మండలంగా జూలూరుపాడు ఉందన్నారు. ఇదే మండలం మీదుగా సీతారామ జలాలు పారుతున్నప్పటికీ, స్థానిక శాసనసభ్యుడు ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇతర జిల్లాలకు ప్రాజెక్టు జలాలు తరలిపోతున్నా ఈ జిల్లా ప్రజాప్రతినిధులు నోరు విప్పకపోవడం స్థానిక రైతాంగాన్ని అవమానించడమేనని వారు తీవ్రస్థాయిలో విమర్శించారు.
పిల్ల కాల్వల కోసం అధికారులు సర్వేలు నిర్వహించినప్పటికీ, భూములు కోల్పోయిన రైతులకు నేటికీ నష్ట పరిహారం ప్రకటించలేదని నాయకులు ధ్వజమెత్తారు. దీనివల్ల అన్నదాతలు తీవ్ర నిరాశకు గురవుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సర్వే చేసిన విధంగా పిల్ల కాల్వలు నిర్మించి, జూలూరుపాడు మండలంలోని చెరువులను సీతారామ జలాలతో నింపి రైతులను ఆదుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం గుండెపూడి, రామచంద్రాపురం శాఖ కార్యదర్శులు ఇల్లంగి సీతారాములు, ఈసం నరసింహారావు, పార్టీ నాయకులు వల్లమల్ల దానయ్య, భూక్యా సురేష్, కోడం బక్కులు, ఇందిరా నాగేశ్వరరావు, గడిగ రాములు, గడగ లక్ష్మణరావు, రైతులు బానోత్ గిరి, ముక్తి గాంధీ, తాటి బుచ్చిరాములు, రాజు, ప్రవీణ్, అశోక్ పాల్గొన్నారు.