– బీఆర్ఎస్ పాల్వంచ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన
– భారీగా తరలివచ్చిన మహిళలు
పాల్వంచ, జూన్ 10 : కొత్తగూడెం కార్పొరేషన్ పాల్వంచ డివిజన్లో నెలకొన్న ప్రజా సమస్యలపై, ప్రధానంగా తాగేందుకు ప్రజలకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పాల్వంచ పట్టణ నడివీధుల్లో మహిళలతో కలిసి పార్టీ నాయకులు భారీ ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. అనంతరం డివిజన్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులు కిలారు నాగేశ్వరరావు, వనమా రాఘవ, కనగాల బాలకృష్ణ ఆధ్వర్యంలో పాల్వంచలోని డివిజన్ కార్యాలయంలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ప్రజలకు కనీసం తాగునీరు కూడా అందించడం లేదని గతంలో రెండు రోజులకోసారి మంచినీళ్లు ఇచ్చేవాళ్లని ఇప్పుడు అది కూడా లేకుండా చేశారని మహిళలు మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అధికారుల తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్ బీఆర్ఎస్ వర్ధిల్లాలంటూ కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అనే నినాదంతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక ప్రజలను ప్రజా సమస్యలను తుంగలో తొక్కి కనీస వసతులు కల్పించలేని దుస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ప్రజలకు కనీస అవసరాలు త్రాగునీరు, రోడ్లు, ట్రైన్లు, వీధి దీపాలు, శానిటైజింగ్, ఇతర చిన్న సమస్యలను కూడా తీర్చలేక పోతుందని, వారి సమస్య చెప్పుకుందాం అంటే అధికారులు అందుబాటులో ఉండే పరిస్థితి కూడా లేదన్నారు. గతంలో కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీగా ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి, రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టణ, గ్రామీణ ప్రాంతాలను అన్ని విధాలుగా శరవేగంగా అభివృద్ధి చేశారన్నారు. తాగునీరు, 24 గంటల కరెంటు సరఫరా చేశారని గుర్తు చేశారు. ఇంకా వివిధ ప్రజా సమస్యలను ఎక్కడికక్కడ అధికారులను అప్రమత్తం చేసి తక్షణమే పరిష్కరించే వారన్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్తగూడెం నియోజకవర్గంలో ఆనాడు పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెం మున్సిపాలిటీకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ప్రజలకు కనీస వసతులను కల్పించినట్లు తెలిపారు. ప్రజా సమస్యలను తీర్చారని కొనియాడారు. ఇప్పుడు కార్పొరేషన్ అయినప్పటికీ కూడా ప్రజా సమస్యలను పట్టించుకునే వారు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, డివిజన్ల వారీగా కార్పొరేటర్లు ఉన్నప్పటికీ వారితో చెప్పుకున్న కూడా సమస్యలు పరిష్కారం కావట్లేదని ప్రజలు వాపోతున్నారు.
ఎందుకంటే కార్పొరేటర్లు సమస్యలు పరిష్కరించాలన్నా కూడా వారికి కనీస నిధులు కేటాయించట్లేదని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పేరుకే కార్పొరేషన్ చేసిందని మరి డివిజన్ల వారీగా తక్షణమే నిధులు కేటాయించి ప్రజా సమస్యలను పరిష్కరిస్తే బాగుంటుందని, లేదంటే రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తక్షణమే ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పాల్వంచ మండల అధ్యక్షుడు మల్లెల శ్రీరామ్ మూర్తి, 39వ డివిజన్ కార్పొరేటర్ గోవాడ గుణచరిత్, దాసరి నాగేశ్వరరావు, కాల్వ ప్రకాష్, పార్టీ పాత పాల్వంచ ఇన్చార్జి ముత్యాల ప్రవీణ్, కుంచెర్ల రామకృష్ణ, బీఆర్ఎస్వీ పాల్వంచ పట్టణ అధ్యక్షుడు జూపెళ్లి దుర్గాప్రసాద్, హర్షవర్ధన్, పత్తిపాటి శీను, రంజిత్, చింతలచెరువు దుర్గాప్రసాద్, చంద్రశేఖర్, యాదయ్య, వాసుమల్ల గౌతం, డీఆర్కే, కుంపటి శివ, కంచర్ల రామారావు, అనంత్, కిలారు చిన్న, వెట్టికోట సుధాకర్, తెలంగాణ సురేష్, బండి అచ్చమ్మ, విజయ, లక్ష్మి, కృష్ణవేణి, సావిత్రి, జోష్ణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

కొత్తగూడెం కార్పొరేషన్ డివిజన్ కార్యాలయం ముట్టడి