(SI Rajaravindra) సుజాతానగర్: కోటిశ్వరుడిగా నిలిచిన ఎస్ఐ రాజారవీంద్ర ఆదివారం వేంకటాద్రి వెంకన్న స్వామిని దర్శించుకున్నారు. ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమంలో కోటి రూపాయలు గెలుచుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖ్యాతిని ఎల్లలు దాటించారు సుజాతానగర్ మండలానికి చెందిన రాజారవీంద్ర. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో పోలీస్ సబ్ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు.
కోటీశ్వరుడైన రాజా రవీంద్ర.. కొత్తగూడెం సమీపంలోని వెంకటగిరిపై కొలువైన వేంకటాద్రి వెంకన్న స్వామిని ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. తొలుత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. పూజా కార్యక్రమం అనంతరం ఆలయ ప్రాంగణంలో కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు ఎల్దండి పూర్ణచందర్ రావు.. కోటీశ్వరుడు రాజారవీంద్రను శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా రాజారవీంద్ర మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న తనకు మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం ఓ ప్రత్యేక గుర్తింపుని తీసుకువచ్చిందన్నారు. తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, ప్రజల ఆధరాభిమానాలే తన విజయానికి కారణమన్నారు. ఎంతో కాలంగా వేంకటాద్రి వెంకన్నను దర్శించుకోవాలనుకున్నానని, ఇనాళ్లకు ఆ స్వామివారికి మొక్కు చెల్లించేందుకు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చానన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నంది శశి కుమార్, మందా రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.