సత్తుపల్లి, మే 6: ఈవీఎం యంత్రాల కమిషనింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. సత్తుపల్లి జ్యోతినిలయంలో చేపడుతున్న సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ ఈవీఎం యంత్రాలు, వీవీ ప్యాట్ల కమిషనింగ్ ప్రక్రియను, మాక్పోల్ను సోమవారం ఆయన పరిశీలించారు. సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్కు చెందిన 294 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్ల కమిషనింగ్ను చేపడుతున్నట్లు తెలిపారు. బ్యాలెట్ యూనిట్ల పొందికలో జాగ్రత్తలు వహించాలని, సంబంధిత సీలింగ్లు చేయాలని సూచించారు. అనంతరం సత్తుపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం, ఐకేపీ బిల్డింగ్లలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి నిర్వహిస్తున్న రిజిస్టర్లు పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియగా చేపడుతున్న తీరును పరిశీలించి ఇంత వరకు ఎంతమంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని అడిగి తెలుసుకున్నారు. భద్రతాపరమైన ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
డబ్బు, మద్యం రవాణా
ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రలోభాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ గౌతమ్ సూచించారు. మండలంలోని జంగారం గ్రామంలోని మేడిశెట్టివారిపాలెం క్రాస్రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్పోస్టును సోమవారం ఆయన తనిఖీ చేశారు. వాహన తనిఖీ రిజిస్టర్ను పరిశీలించి ‘ఏయే రకాల వాహనాలు తనిఖీ చేస్తున్నారు? ఇంతవరకు చెక్పోస్టు తనిఖీల్లో పట్టుబడిన నగదు, మద్యం, ఇతర వివరాలు ఏమిటి?’ అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వాహనాలు, రాజకీయ పార్టీల వాహనాలు, అన్ని రకాల వాహనాలను తనిఖీ చేయాలని సూచించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శిక్షణ సహాయ కలెక్టర్ మిర్నల్శ్రేష్ట, కల్లూరు ఆర్డీవో రాజేందర్, ఏసీపీ రఘు, ఆర్డీవో కార్యాలయ అధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్ యోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.