ఖమ్మం/ రఘునాథపాలెం, మే 6: కాంగ్రెస్వన్నీ మోసపూరిత వాగ్దానాలేనని తేలిపోయిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి స్వయంగా తాను చెప్పిన మాటలను అమలుచేయకపోవడమే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. ఖమ్మం లోక్సభ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం నగరం, రఘునాథపాలెం మండలంలో సోమవారం ఆయన రోడ్షోలు, ఇంటింటి ప్రచారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆచరణ సాధ్యం కాని 420 హామీలను ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వాటిని అమలుచేయలేక మల్లగుల్లాలు పడుతోందని విమర్శించారు. రూ.15 వేల రైతుభరోసా రాలేదని, రైతులకు రుణమాఫీ కాలేదని, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం అందలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పినట్లుగా పొరపాటున వెళ్లి బ్యాంకుల్లో రూ.2 లక్షల పంట రుణం తీసుకొని ఉంటే ఏమై ఉండేదో రైతులు అర్థం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో ఆ వాగ్దానాలు అమలు చేయించేందుకు బీఆర్ఎస్ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుందని స్పష్టం చేశారు. ఇందుకోసం బీఆర్ఎస్ను ప్రజలు బలపర్చాలని కోరారు. ఈ లోక్సభ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఆర్భాటంగా హామీలిచ్చిన కాంగ్రెస్ నేతలు.. అధికారం చేపట్టాక వాటిని అటకెక్కించారని అజయ్కుమార్ విమర్శించారు. ఎంతో గొప్పగా చెప్పిన తులం బంగారం తుస్సుమన్నదని, కల్యాణలక్ష్మి కస్సుమన్నదని ఎద్దేవాచేశారు. అధికారం చేపట్టి ఐదు నెలలు గడుస్తున్నా రూ.500కి గ్యాస్ ఇవ్వలేదని, మహిళలకు రూ.2500 జాడలేదని విమర్శించారు. గడిచిన పదేళ్లలో ఎన్నడూలేని విధంగా ఖమ్మం నగరంలో మళ్లీ మంచినీటి కష్టాలు తెచ్చిన చరిత్ర ఈ కాంగ్రెస్ మరోసారి మూటగట్టుకుందని దుయ్యబట్టారు. అందుకని ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పగడాల నాగరాజు, బుర్రి వెంకట్కుమార్, పగడాల శ్రీవిద్య, బుర్రి వినయ్కుమార్, శీలంశెట్టి వీరభద్రం, తాజుద్దీన్, సూత్రాల శ్రీను, రాములు, సురేశ్, సైదా, అజ్మీరా వీరూనాయక్, మద్దినేని వెంకటరమణ, కొంటెముక్కల వెంకటేశ్వర్లు, తుమ్మలపల్లి మోహన్రావు, వల్లభనేని వెంకటప్పారావు, నరేశ్ పాల్గొన్నారు.