చుంచుపల్లి, జూన్ 10 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు మంగళవారం చుంచుపల్లి మండలంలోని విద్యానగర్ కాలనీలో గల సీఎంఆర్ షాపింగ్ మాల్లో పనిచేస్తున్న మహిళలకు రక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షీ టీమ్ ఎస్ఐ రమాదేవి మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం షీ టీమ్ బృందం పనిచేస్తుందని తెలిపారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇంట్లోగానీ, పని ప్రదేశాల్లో గానీ మహిళలను ర్యాగింగ్ చేసినా, వెంబడించినా, అసభ్యంగా కామెంట్లు చేసినా, రాంగ్ కాల్స్ చేసినా, అనుచితంగా ప్రవర్తించినా, సోషల్ మీడియాలో వేధింపులకు గురిచేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
వేధింపులపై మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలన్నారు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచబడును అని తెలిపారు. మహిళలు ఫిర్యాదు ఇవ్వాలనుకుంటే కొత్తగూడెం షీ టీమ్ ఫోన్ నంబర్ 8712682131కి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ నాగయ్య, కానిస్టేబుల్ రాంబాబు, హోంగార్డ్ వెంకటేశ్వర్లు, సూపర్ వైజర్ సతీశ్, సీఎంఆర్ షాపింగ్ మాల్ సిబ్బంది పాల్గొన్నారు.