చుంచుపల్లి, జూన్ 23 : వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన చుంచుపల్లి మండలంలోని ప్రశాంతి నగర్ రైతు వేదికలో “రైతు ముంగిట్లో విత్తన మేళా” కార్యక్రమం ఆశించిన స్థాయిలో అమలు కాకపోవడంతో రైతులు నిరాశకు గురయ్యారు. ప్రభుత్వం ప్రకటించిన కార్యక్రమం మేరకు గ్రామాల వారీగా రైతు వేదికల్లో వివిధ రకాల నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచాల్సి ఉన్నప్పటికీ మండలంలోని రైతు వేదికల్లో ప్రభుత్వం ప్రకటించిన ఆ ఏడు వరి రకాలకు చెందిన విత్తనాలు లేకపోవడంతో రైతులు విస్మయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన ఏడు రకాల వరి వంగడాల విత్తనాలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ద్వారా రైతులకు అందించాల్సి ఉన్నా అవి అందుబాటులో లేకపోవడం రైతుల్లో అసంతృప్తిని కలిగించింది. కార్యక్రమం ద్వారా తక్కువ ధరకు నాణ్యమైన విత్తనాలు లభిస్తాయని ఆశించిన రైతులు రైతు వేదికలకు చేరుకోగా నిరాశతో వెనుదిరిగారు.
కేవలం కృషి విజ్ఞాన కేంద్రం (KVK) ద్వారా తీసుకొచ్చిన కొద్దిపాటి విత్తన సంచులను మాత్రమే కొంతమంది రైతులకు అందజేయగా, మిగతా రైతులకు విత్తనాలు అందలేదు. దీంతో ఇప్పటికే సాగు పనులు ఆలస్యమవుతున్న నేపథ్యంలో పలువురు రైతులు ఇతర ప్రాంతాలకు వెళ్లి విత్తనాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయమై వ్యవసాయ శాఖ అధికారులు, పీఏసీఎస్ సీఈఓను వివరణ కోరగా చుంచుపల్లి మండలంలో విత్తనాల డీలర్లు లేరు. ప్రభుత్వం నుంచి ఇంకా విత్తనాలు అందలేదు. మరో రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది” అని తెలిపారు. కేవలం జీరుగులు మాత్రమే అందుబాటులో ఉంచడం ఏంటని, అయితే ప్రభుత్వం ఘనంగా ప్రకటించిన విత్తన మేళా కార్యక్రమంలో రైతులకు అవసరమైన సమయంలో విత్తనాలు అందుబాటులో లేకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు వేదికల్లో విత్తనాలు అందుబాటులో ఉంచుతామని ప్రకటించిన ప్రభుత్వం ఆ హామీని అమలు చేయడంలో ఎందుకు విఫలమైందని వారు ప్రశ్నిస్తున్నారు.