– నిర్దేశిత స్టాప్ లేక బస్సుల వెనుక ప్రయాణికుల పరుగులు
– మూడేళ్లయినా కదలని యంత్రాంగం
జూలూరుపాడు, ఏప్రిల్ 08 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ప్రయాణికుల కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయి. మండల కేంద్రం నుండి రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులకు కనీసం నీలువ నీడ లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
బస్సు షెల్టర్ లేకపోవడంతో బస్సులు ఎక్కడ ఆగుతాయో తెలియక ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ప్రయాణికులు ఒకచోట వేచి ఉంటే, డ్రైవర్లు బస్సులను మరోచోట నిలుపుతున్నారు. దీంతో బస్సు ఎక్కేందుకు వృద్ధులు, మహిళలు, పిల్లలు బస్సు వెనుక పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఒక్కోసారి బస్సు దొరక్క ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నాలుగు ఏళ్ల క్రితం రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో రహదారి పక్కనే ఉన్న పాత బస్ షెల్టర్ను అధికారులు తొలగించారు. అనంతరం నాలుగు లైన్ల రహదారి నిర్మాణం పూర్తి చేసుకుని మూడు ఏళ్లు గడుస్తున్నా, కొత్త బస్ షెల్టర్ను నిర్మించడంలో అధికారులు విఫలమయ్యారు. మండలంలోని 24 పంచాయతీల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు పట్టణాలకు వెళ్లాలంటే ఇక్కడి నుండే ప్రయాణించాలి. షెల్టర్ లేక వేసవిలో ఎండకు, వానాకాలంలో వర్షానికి తడుస్తూ గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. రహదారిపై బస్సుల కోసం పరుగులు తీస్తుండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలగించిన బస్ షెల్టర్ను వెంటనే పునరుద్ధరించి బస్సులు ఆగేందుకు నిర్దేశిత స్థలాన్ని ఏర్పాటు చేయాలని ప్రజా ప్రతినిధులు, అధికారులను మండల ప్రజలు కోరుతున్నారు.

ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ.. జూలూరుపాడులో ‘బస్ షెల్టర్’ కరువు