భద్రాచం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంఆధ్వర్యంలో ఈరోజు పౌర్ణమి సందర్భంగా శబరి స్మృతియాత్ర నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈఓ బానోత్ శివాజీ తెలిపారు. కోవిడ్-19 నిబంధనల మేరకు కొద్దిమంది అర్చక, వైదిక సిబ్బందితో నిరాడంబరంగాశబరి స్మృతి యాత్ర నిర్వహించనున్నట్లు ఈఓ వివరించారు. శబరి నది నుంచి తీసుకువచ్చిన తీర్థంతో బలిపీఠం వద్ద అభిషేకం జరుపుతారు. స్వామివారి నిత్యకల్యాణం అనంతరం పుష్పోత్సవం, ఫలోత్సవం చేస్తారు. 28న పునర్వసు నక్షత్రం సందర్భంగా బేడా మండపంలో స్వర్ణమూర్తులకు విశ్వఅభిషేక తిరుమంజనం నిర్వహిస్తారు.
29న పుష్యమి నక్షత్రం సందర్భంగా శ్రీసీతారామయ్యకు పట్టాభిషేకం, నవంబర్ 1న సర్వేశాం ఏకాదశి సందర్భంగా అంతరాలయంలోని మూలమూర్తులకు మధ్యాహ్నాం 3గంటల నుంచి 5గంటల వరకు లక్ష కుంకుమార్చన జరుపుతారు. అలాగే 3న నరక చతుర్థశి (తెల్లవారితే 4వ తేది గురువారం) తెల్లవారుజామున 3గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి చేస్తారు. 3.30గంటలకు సుప్రభాత సేవ, విశ్వక్సేన పూజ, భగవత్ ఫుణ్యాహవాచనం, అష్టదిక్పాలక ఆవాహనం, పంచపాలికా దీపారాధన చేస్తారు. ముందుగా మూలమూర్తులకు మంగళ స్నానాలు, ఆస్థాన హరిదాసులు తూము నర్సింహదాసు, భక్త రామదాసు కీర్తనలు ఆలపించనున్నారు.