కొత్తగూడెం గణేష్ టెంపుల్, జులై 01 : ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పాలక ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ మాస్ లైన్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎవరినైనా ప్రశ్నిస్తానన్నారు. పాలక ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను కొలగొట్టేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు.
సర్ పేరుతో ఓట్లను తొలగించి తమకు అనుకూలమన్న ఓటర్లను మాత్రమే చేర్చే ప్రక్రియ చేస్తున్నారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని, జీవో నెంబర్ 76 ను పునరుద్ధరించి ఇంటి పట్టాలు మంజూరు చేయాలన్నారు. పేదల పక్షాన పోరడడానికి తాను ఎప్పుడు సిద్ధమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ మూడు గణేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు, ముత్యాలు, విశ్వనాథం, తుపాకుల నాగేశ్వరరావు పాల్గొన్నారు.