– సింగరేణి ప్రధాన వైద్యశాల ముఖ్య వైద్యాధికారికి ఏఐటీయూసీ నాయకుల వినతి
రుద్రంపూర్, జూన్ 01 : రామవరం సింగరేణి డిస్పెన్సరీ మూసివేతను యాజమాన్యం తక్షణమే విరమించుకోవాలని, డిస్పెన్సరీని పునరుద్దరించాలని గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం సింగరేణి ప్రధాన వైద్యశాల ముఖ్య వైద్యాధికారి(సిఎంఓ) కిరణ్ రాజ్ కు ఏఐటీయూసీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ మాట్లాడుతూ రామవరం ప్రాంతంలో నివసిస్తున్న వందలాది మంది సింగరేణి కార్మికులు, మాజీ కార్మికులు, వారి కుటుంబాలతో పాటు కాంట్రాక్టు కార్మికులకు ఈ వైద్యశాల ఎంతోకాలంగా వైద్య సేవలు అందిస్తోందని, ఈ డిస్పెన్సరీలో కొత్త వైద్యుల నియామకం చేపట్టి, సరైన స్టాఫ్ నియమించి కార్మికులకు మందులు ఇచ్చేలా చూడాలని కోరారు.
ఇక్కడ పనిచేసే ఉద్యోగి పదవీ విరమణ పొందడంతో, కొత్తవారిని నియమించకుండా డిస్పెన్సరీకి ఏకంగా సీల్ చేయడం సరైంది కాదన్నారు. ఈ డిస్పెన్సరీని మూసివేయడం వల్ల స్థానిక కార్మిక కుటుంబాలు చిన్నపాటి వైద్య సేవలకు సైతం సుదూర ప్రాంతంలోని ప్రధాన వైద్యశాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వారికి ఆర్థికంగా, శారీరకంగా తీవ్ర భారంగా మారుతుందని పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం వైద్యులను, సిబ్బందిని నియమించి ఆస్పత్రిని రామవరం డిస్పెన్సరినీ యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. సానుకూలంగా స్పందించిన (సి ఎం ఓ) కిరణ్ రాజ్ డిస్పెన్సరీ భవనం పునర్నిర్మాణం చేసి త్వరితగతిన సమస్యను పరిష్కరించి రామవరం డిస్పెన్సరీలో డాక్టర్ ను, స్టాఫ్ ను నియమించి పునరుద్ధించేల చేస్తామని హామీ ఇచ్చారు.
కావున కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ రామవరం డిస్పెన్సరీ ఏరియా అధీనంలో ఉంది కాబట్టి డిస్పెన్సరీ భవనాన్ని పునర్నిర్మాణం చేపట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.వి.రమణమూర్తి, సహాయ కార్యదర్శులు గట్టయ్య, రాము, వైస్ ప్రెసిడెంట్ కత్తెర్ల రాములు, పిట్ కార్యదర్శిలు అనంతలక్ష్మి, మధు కృష్ణ, కమల్, ఆఫీస్ బ్యారర్స్ నాగయ్య, కర్రు రమేష్, సీనియర్ నాయకులు మర్రి గోపి, లక్ష్మీనారాయణ, మండల రాజేశ్వరరావు పాల్గొన్నారు.