– భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యాన శాఖ అధికారి జె.బంగ కోటేశ్వర్
చుంచుపల్లి, మే 30 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఉద్యాన పంటల రైతులకు జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ శుభవార్త అందించింది. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగు చేస్తున్న రైతులకు నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు “డ్రిప్ ఆటోమేషన్” సాంకేతికతను సబ్సిడీపై అందించనున్నట్లు జిల్లా ఉద్యాన శాఖ అధికారి జె. బంగ కోటేశ్వర్ తెలిపారు. డ్రిప్ ఆటోమేషన్ వ్యవస్థ ద్వారా రైతులు మొబైల్ ఫోన్ లేదా కంట్రోల్ యూనిట్ సహాయంతో నీటి పారుదల వ్యవస్థను సులభంగా నియంత్రించవచ్చు. దీంతో నీటి వినియోగం తగ్గడంతో పాటు విద్యుత్, శ్రమ, సమయం ఆదా అవుతాయని చెప్పారు. నేలలోని తేమ స్థాయిని బట్టి ఆటోమేటిక్గా నీటి సరఫరా జరిగే విధంగా ఈ వ్యవస్థ పని చేస్తుందన్నారు.
ఈ పథకం కింద ఒక హెక్టారు విస్తీర్ణానికి డ్రిప్ ఆటోమేషన్ యూనిట్ ధర రూ.40,000గా నిర్ణయించారు. ఇందులో రైతులకు 55 శాతం సబ్సిడీగా రూ.22,000 అందించగా, మిగిలిన 45 శాతం అంటే రూ.18,000 రైతులు భరించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ సబ్సిడీని RKVY/PDMC పథకాల ద్వారా అందించనున్నట్లు తెలిపారు. జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకున్న రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఆసక్తి గల రైతులు తమ సమీప ఉద్యాన శాఖ కార్యాలయాలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.