– కలెక్టర్కు బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం అందజేత
కొత్తగూడెం గణేష్ టెంపుల్, సెప్టెంబర్ 07 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, వెయ్యి రోజుల పాలనలో అన్నివర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు సోమవారం గ్రీవెన్స్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీల పేరుతో నమ్మించి అధికారంలోకి వచ్చిందన్నారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పి వెయ్యి రోజులు పూర్తి అయిన ఇప్పటి దాకా ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, తులం బంగారం, స్కూటీలు, రైతుల పంటకు రక్షణ రైతు భరోసా, కొరత లేకుండా ఎరువుల పంపిణీ, పంటలకు బోనస్, 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.
రైతు కూలీలకు సంవత్సరానికి రూ.12 వేలు, ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు, అర్హులైన నిరుద్యోగ యువతకు, నిరుద్యోగ భృతి, ఉద్యోగం, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని, విద్యార్థులకు విద్యా భరోసా, పెండింగ్ ఫీజు బకాయిల చెల్లింపు
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు, బీడీ కార్మికులకు పెంచిన రూ .4 వేలు పెన్షన్, ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు,
బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, విద్యార్థి, యువజన, రైతు వంటి వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో మాజీ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, మాజీ వైస్ చైర్మన్ దామోదర్, కార్పొరేటర్లు సింధు తపస్వి, వేల్పుల వీరమ్మ, మల్హోత్రా సాగర్, గుణచరిత, మాజీ కౌన్సిలర్లు తోగరు రాజశేఖర్, వేణుగోపాల్, పార్టీ మండల అధ్యక్షులు ఉన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దాదాపు అరగంటసేపు రాస్తారోకో, ఆందోళన చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి. పాల్వంచ పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనను విరమింపజేశారు.