– రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు
– మార్క్ ఫెడ్ అధికారులకు వినతిపత్రం అందజేత
ఖమ్మం రూరల్, ఏప్రిల్ 30 : మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కారం చేయాలని తెలంగాణ రైతు సంఘం (ఏఐకేఎస్) ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చింతకాని, బోనకల్, వైరా, ఖమ్మం, రూరల్ మండలంలోని రైతులు పెద్ద సంఖ్యలో పెద్దతండా వద్ద గల మార్క్ ఫెడ్ కు చేరుకుని పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మార్క్ ఫెడ్ డీఎం శ్యామ్ కుమార్ కు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా బొంతు రాంబాబు మాట్లాడుతూ.. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల నుంచి బస్తాలు తరలింపు కోసం అవసరమైన లారీలు అందుబాటులో ఉంచాలని, కౌలు రైతుల పేర్లు నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని, గోదాములు దగ్గర దిగుమతి ఆలస్యం పేరుతో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయ శాఖ మార్కెట్ గోదాములు యార్డులు ఉపయోగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో రెండు లక్షల ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేసి రాష్ట్రంలో ఎక్కువ దిగుబడి సాధించిందన్నారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవని,నెల రోజుల నుంచి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. సమస్యలను త్వరగా పరిష్కరించకపోతే రైతు సంఘం ఆధ్వర్యంలో మంత్రుల ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. సానుకూలంగా స్పందించిన మార్క్ ఫెడ్ డీఎం విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే.మీరా సాహెబ్, దొండపాటి నాగేశ్వరరావు, రావుల రాజాబాబు, ఉరడీ సుదర్శన్ రెడ్డి, నందిగామ కృష్ణ, చండ్ర వెంకట్రావు, వెంపటి వెంకటేశ్వరరావు, వీరయ్య, పలువురు రైతులు పాల్గొన్నారు.