రుద్రంపూర్, జూలై 15 : చుంచుపల్లి గ్రామ పంచాయతీ అధికారులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారంటూ సుభాష్ చంద్రబోస్ నగర్, పరిసర కాలనీల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాబుక్యాంప్ వైకుంఠధామం ప్రాంగణంలో ప్రతిరోజూ చుంచుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో సేకరించిన చెత్తను బహిరంగంగా తగలబెట్టడంతో దట్టమైన పొగ, దుర్వాసన వెదజల్లుతూ స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి ఈ ప్రాంతంలోనే పోలీస్ స్టేషన్, సీఎంపీఎస్ కార్యాలయం, పాఠశాల, ఐటీఐ కళాశాలతో పాటు గోదుమవాగు పరిసరాల్లో వందలాది కుటుంబాలు నివాసం ఉంటున్నాయని తెలిపారు. ఇంత జనసాంద్రత ఉన్న ప్రాంతంలో వ్యర్థాలను బహిరంగంగా దహనం చేయడం వల్ల విషపూరిత పొగ వ్యాపించి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. ప్రతిరోజూ చెత్త దహనం కారణంగా పాఠశాల విద్యార్థులు కళ్ల మంటలు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి పరిస్థితి మరింత దుర్భరంగా మారుతోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇళ్ల తలుపులు, కిటికీలు మూసుకున్నా దుర్వాసన నుంచి ఉపశమనం లభించడం లేదని, కాలుష్యంతో సాధారణ జీవనం కష్టంగా మారిందని వాపోతున్నారు. ఘన వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాల్సిన ఉండగా దానిని బహిరంగంగా తగలబెట్టడం పర్యావరణ పరిరక్షణ నిబంధనలకు విరుద్ధమని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్, కొత్తగూడెం మేయర్, చుంచుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తక్షణమే స్పందించి బహిరంగంగా చెత్త తగలబెట్టడాన్ని నిలిపివేసి, శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.