Bhadrachalam | భద్రాచలం, అక్టోబరు 17: భద్రాచలంలో అక్రమంగా నిర్వహిస్తున్న పలు బెల్టుషాపులపై పోలీసులు ఆకస్మిక దాడుల నిర్వహించారు. ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ సెంటర్, బస్టాండ్ ఎదురుగా, చర్ల రోడ్డులోని పలు దుకాణాల్లో దాడులు నిర్వహించారు.
పట్టణంలోని పలు పాఠశాలలు, కాలనీలోని ఇళ్ల మధ్యలో, జాతీయ రహదారి పక్కనే బెల్టు షాపులు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో నేరుగా ఏఎస్పీ పర్యవేక్షణలోనే దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా దాడుల సమాచారం ముందుగానే తెలుసుకున్న పలువురు బెల్ట్ షాపు నిర్వాహకులు దుకాణాలకు తాళాలు వేసి పరారయ్యారు.