పాల్వంచ, మే 02 : పాల్వంచ పట్టణంలోని నెహ్రూ నగర్లో గల కొత్తగూడెం గిరిజన బాలికల డిగ్రీ కళాశాల (TGTWRDC Girls Kothagudem)లో ఐటీసీ ఎంఎస్కే (ITC MSK), ప్రథమ్ స్కిల్లింగ్ ఎకో సిస్టమ్ (Pratham Skilling Ecosystem) సహకారంతో శనివారం ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్లో 200 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. అందులో 120 మంది వివిధ ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఫాక్స్కాన్ (Foxconn), టాటా ఎలక్ట్రానిక్స్ (Tata Electronics), నమో ట్రేడర్స్ (Namo Traders) వంటి సంస్థలు ఈ డ్రైవ్లో పాల్గొన్నాయి.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ మాట్లాడుతూ. విద్యార్థినుల భవిష్యత్ అభివృద్ధికి ఇటువంటి ప్లేస్మెంట్ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఎంపికైన విద్యార్థినులను అభినందించి, వారు తమ వృత్తి జీవితంలో మరింత ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్లేస్మెంట్ సెల్ కో ఆర్డినేటర్ నాగేశ్వరరావు, సీజీసీ కో ఆర్డినేటర్ భారతి, ఐటీసీ ఎంఎస్కే ప్రథమ్ కో ఆర్డినేటర్ ఎన్.నరేష్, ఆర్.ఉప్పల్, కో ఆర్డినేటర్ పాల్గొన్నారు.

కొత్తగూడెం గిరిజన బాలికల డిగ్రీ కళాశాలలో భారీ ప్లేస్మెంట్ డ్రైవ్