– డిఎల్ఆర్ కార్మికులకు రేషన్ కిట్లు
– నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం
రుద్రంపూర్, మార్చి 18 : రంజాన్ అంటే కేవలం ఉపవాసం కాదు. రంజాన్ అంటే ఆకలి ఏమిటో అనుభవించడం.. దాహం ఎంత కష్టమో తెలుసుకోవడం. అదే బాధలో ఉన్నవారిని చూసి మన హృదయం కరిగిపోవడం అని పీవీకే 5 ఇంక్లైన్ గని మేనేజర్ డా.శ్యాం ప్రసాద్ అన్నారు. బుధవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పద్మావతి గని ముస్లిం ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని గని పై పని చేస్తున్న డిఎల్ఆర్ కార్మికులకు కుల మతాలకు అతీతంగా ఒక్కొక్కరికి 15 కిలోల బియ్యం ప్యాకెట్తో పాటు నిత్యావసర సామగ్రిని అందజేశారు. అదేవిధంగా కొత్తగూడెం ప్రాంతంలో నివసిస్తున్న ఒక నిరుపేద కుటుంబానికి పెళ్లి ఖర్చుల కోసం రూ.10 వేల ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గని మేనేజర్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం మానవత్వం, సానుభూతి, సామాజిక బాధ్యతను ప్రతిబింబించినట్లు తెలిపారు.
పలువురు నాయకులు మాట్లాడుతూ.. రంజాన్ పండుగ అసలైన సారాంశం మన చుట్టూ ఉన్న వారి ఆకలి తీర్చడంలో, అవసరంలో ఉన్నవారికి చేయూతనివ్వడంలోనే ఉందన్నారు. అన్ని మతాల బోధనల ప్రకారం ప్రతి వ్యక్తి తన సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు సహాయం చేయాలని సూచించారు. పరస్పర సహకారం, ప్రేమ, దాతృత్వం ద్వారా సమాజంలో ఐక్యత పెంపొందుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఎస్.నాగేశ్వరరావు, రమేశ్, ఐఎన్టీయూసీ ఏరియా ఉపాధ్యక్షులు ఎండీ.రజాక్, చిలక రాజయ్య, హెచ్ఎంఎస్ చిట్టిబాబు, నవీన్, సిఐటియు విజయగిరి శ్రీనివాస్, టీబీజీకేఎస్ గడప రాజయ్య, వెంకటేశ్వర్లు, బిఎంఎస్ ఎస్.నాగేశ్వరరావు, ముస్లిం ఎంప్లాయీస్ సభ్యులు ఎండీ ఆసిఫ్, సవీర్, ఖాజా పాషా, అలీం, తాజు, అమన్, నయీమ్, బషీర్, అజ్మత్, జానీ, సలీం, రఫీ, ఖాజా, అజీమ్ పాల్గొన్నారు.

రంజాన్ స్ఫూర్తితో దాతృత్వం