దమ్మపేట :టీఎస్ ఆయిల్ఫెడ్లో దళారీ వ్యవస్థను రద్దు చేయాలని పామాయిల్ రైతులు కోరారు. దమ్మపేట రైతు వేదికలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని పామాయిల్ రైతుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా దళారుల ద్వారా ఆంధ్రా నుంచి వచ్చే పామాయిల్ గెలలను అనుమతించకూడదని తీర్మానించారు. ఆంధ్రా పామాయిల్ గెలల వల్ల ఆయిల్ రికవరీ తగ్గిపోతుందని అన్నారు. పామాయిల్ నర్సరీ పర్యవేక్షణ, సాంకేతిక అర్హత లేని అధికారి ఇన్చార్జిగా ఉండడటంతో నాసీరకం మొక్కల ఉత్పత్తి జరుగుతుందని రైతులు పేర్కొన్నారు.
పామాయిల్ మొక్కల కేటాయింపులో కొందరు అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మొక్కలు ట్రాక్టర్లలో లోడ్ చేసినప్పుడు లెక్క తక్కువగా వస్తున్నాయని రైతులు వాపోయారు. పామాయిల్ కర్మాగారాలకు వచ్చిన గెలలు, ఆయిల్ రికవరీ ఎంత శాతం వచ్చింది, క్రూడ్ ఆయిల్ ఎంత ధరకు అమ్మారు, నర్సరీ నిర్వహణలో కంట్రాక్టర్ వ్యవస్థను తొలగించి ఆయిల్ఫెడ్ నిర్వహించాలని అన్నారు.
ఆయిల్ఫెడ్ కార్యకలాపాలన్నీ పారదర్శకంగా రైతులకు తెలిపే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్,వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావుల దృష్టికి తీసుకెళ్లడానికి తాత్కాలిక కమిటీని ఈ సమావేశంలో ఎంపిక చేశారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆలపాటి ప్రసాద్ మాట్లాడుతూ అక్టోబర్ 20వ తేదీన రైతు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు
. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి శీమకుర్తి వెంకటేశ్వరరావు, ఆలపాటి రాము, కొక్కెరపాటి పుల్లయ్య, కాసాని వెంకటేశ్వరరావు, మద్దినేని వెంకట్, రావు జోగేశ్వరరావు, చెలికాని సూరిబాబు, దేవరపల్లి హరిక్రిష్ణ, కోటగిరి సీతారామస్వామి, జూపల్లి రమేష్, దారా తాతారావు, పూర్ణ చంద్రా రెడ్డి, ఉమా మహేశ్వరరెడ్డి, చీకటి బాలాజి, మోరంపూడి శ్రీనివాసరావు, దొడ్డా లక్ష్మినారాయణ, గోపాలరావు తాండ్ర ఉమామహేశ్వరరావు, మోహన్రావు, రామక్రిష్ణ, బాబా తదితరులు పాల్గోన్నారు.