- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్
జూలూరుపాడు, మే 27 : ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల శాతాన్ని గణనీయంగా పెంచేందుకు వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (DM&HO) డాక్టర్ తుకారాం రాథోడ్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఔషధాల నిల్వలు, గర్భిణీల రిజిస్టర్లు, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమ అమలు తీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించి, సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. తల్లి, శిశు మరణాల రేటును తగ్గించడమే లక్ష్యంగా పనిచేయాలని, హైరిస్క్ గర్భిణీలను ముందస్తుగానే గుర్తించి వారికి అవసరమైన ఉన్నత వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఎండల తీవ్రత విపరీతంగా ఉన్నందున, ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా విస్తృతంగా అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలెవ్వరూ బయటకు వెళ్లవద్దని సూచించారు.
శరీరంలో నీటి శాతం తగ్గకుండా తగినంత నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, ఓఆర్ఎస్ ద్రావణాలు తీసుకోవాలని ప్రజలకు వివరించాలన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఈ వేసవిలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించేలా చూడాలన్నారు. అదేవిధంగా, దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, వారానికి ఒకరోజు తప్పనిసరిగా ‘డ్రై డే’ పాటించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ, ప్రతి చిన్నారికి సమయానికి టీకాలు అందేలా చూడాలన్నారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులను గుర్తించి, వారిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఎంఎల్ హెచ్ పీ వెంకటేష్, హెచ్వి రాధిక, నర్సింగ్ ఆఫీసర్ మరియు ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.