కొత్తగూడెం: నియోజకవర్గ ప్రజలే నాకు దేవుళ్లని.. కార్యకర్తలు నాకు బలమని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం వనమా పుట్టిన రోజు సందర్భంగా పాత పాల్వంచలోని ఆయన స్వగృహంలో వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యకర్తలు, అభిమానులు, నాయకుల మధ్య ఆయన కేక్ కట్ చేశారు. ఈసందర్భంగా అభిమానులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… నా జీవితం ప్రజలకే అంకితమని, నా తుది శ్వాస వరకు ప్రజల మధ్య గడుపుతానని, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా చేసిన కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల నాయకత్వంలో కొత్తగూడెం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నంబర్వన్గా చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, మున్సిపల్ చైర్పర్సన్, మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.