బూర్గంపహాడ్, జూలై 19 : భూముల రీసర్వే పనుల్లో జాప్యం జరిగితే సహించేదిలేదని..నిర్ణీత గడువులోగా భూముల రీసర్వే పూర్తిచేసేలా సంబంధిత శాఖల అధికారులు కార్యాచరణ చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. ఆదివారం నియోజకవర్గ పర్యటనలో భాగంగా సారపాక ఐటీసీ అతిథిగృహంలో రెవెన్యూ, అటవీ, పోలీసుశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ జిల్లాలో 70 గ్రామాల్లో చేపడుతున్న భూముల రీసర్వే పనుల పురోగతిని సమీక్షించి అధికారులు జిల్లాలో ప్రస్తుతం 14 గ్రామాల్లో రీ సర్వే పనులు కొనసాగుతుండగా వాటిలో ఐదు గ్రామాల్లో పనులు పూర్తయ్యాయని వివరించారు.
మిగిలిన గ్రామాల్లో నిర్ణీత గడువులో రీసర్వే పూర్తిచేసేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు.
ఈ సమీక్షలో కలెక్టర్ అంకిత్, జిల్లా అటవీశాఖ అధికారి సిద్దార్థ విక్రమ్సంగ్, ఎస్పీ రోహిత్రాజ్, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారె ఆదినారాయణ, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి, ఆర్డీవో మధు, అటవీ, రెవెన్యూ, పోలీసుశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.