టేకులపల్లి, మే 11 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో సులానగర్, దాసుతండా, కుంటల్ల, హన్మతండా, బొమ్మనపల్లి, సంపత్ నగర్ పంచాయతీల్లో భారీగా మట్టి అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సులానగర్ సమీపంలో ప్రధాన రహదారి ఎన్ హేచ్ 980పీ రోడ్డు పక్కనే లోతుగా అక్రమ మట్టి రవాణా చేయడంతో అక్కడ క్వారీని తలపిస్తుందని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దాసుతండా, కుంటల్ల, హన్మతండా, బొమ్మనపల్లి ప్రాంతాల్లో అనునిత్యం మట్టి రవాణా కొనసాగుతునే ఉందని, రాత్రి వేళల్లో వాహనాలు ఓవర్ స్పీడ్తో వెళ్తున్నట్లు మండల ప్రజలు తెలుపుతున్నారు.
చెరువుల్లో భారీగా పట్టపగలే యదేచ్చగా మట్టి తోలకం చేస్తుంటే అధికారులు పట్టించుకోకపోవడంతో విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల అండతోనే అక్రమార్కులు మట్టి రవాణా చేస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇతర అవసరాలకు మట్టిని రూ.600 నుండి రూ.800 వరకు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. అధికారులు స్పందించి మట్టి అక్రమ తవ్వకాలు అరికట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మట్టి రవాణాపై టేకులపల్లి తాసీల్దార్ వివరణ కోరగా మట్టి రవాణాకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.