– లక్ష్మీపురంలో వెలుగుచూసిన ఘటన
బూర్గంపహాడ్, మే 11 : మద్యం మత్తులో ఘర్షణ చోటుచేసుకోవడంతో బండరాయితో మోది వ్యక్తిని దారుణంగా హత్యచేసిన సంఘటన బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురం లారీ యార్డు సమీపంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. బీహార్ రాష్ట్రం నవాడ జిల్లాకు చెందిన కుందన్ సింగ్ (45) గత కొంతకాలంగా మండల పరిధిలోని లక్ష్మీపురంలో లారీ కమాన్ కట్టల మేస్త్రిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో తనతో పాటు పనిచేసే ముగ్గురు వ్యక్తులు కలిసి పూటుగా మద్యం సేవించారు. ఈ క్రమంలో వారి మధ్య మాటమాట పెరగడంతో ఘర్షణకు దారితీసింది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన అతడి స్నేహితుల్లో ఒకరు కుందన్ సింగ్ పై బండరాయితో దాడిచేయడంతో ఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యాడు.
సమాచారం అందుకున్న ఎస్ఐ మేడా ప్రసాద్ సోమవారం ఉదయం లక్ష్మీపురంలో సంఘటనా స్థలానికి చేరుకుని హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. క్లూస్ టీం పిలిపించి హత్య జరిగిన ప్రదేశంలో వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణ కారణంగానే వ్యక్తిని హతమార్చారా లేదా వారి మధ్య ఏమైనా పాతకక్షలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు కారణమైన ముగ్గురు వ్యక్తులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. హత్య కేసును పాల్వంచ సీఐ సతీష్ కేసును దర్యాప్తు చేస్తున్నారు.