– భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు ఏదులాపురం గోపాలరావు
జూలూరుపాడు, మే 21 : భవన నిర్మాణ కార్మికుల సుదీర్ఘ కాల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25న రాష్ట్ర లేబర్ కార్యాలయం ముందు నిర్వహించ తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు ఏదులాపురం గోపాలరావు పిలుపునిచ్చారు. గురువారం జూలూరుపాడు మండల కేంద్రంలో తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏదులాపురం గోపాలరావు మాట్లాడుతూ.. 60 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ.9 వేల పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు. ప్రమాద ఇతర పథకాల అమలులో ప్రైవేట్ ఏజెన్సీల రెన్యువల్ పద్ధతిని తక్షణమే నిలిపివేయాలని, ప్రైవేట్ సంస్థలతో నిర్వహించే ఆరోగ్య పరీక్షలను రద్దు చేసి కార్మికులందరికీ ఈఎస్ఐ ఆసుపత్రి సౌకర్యాన్ని కల్పించాలని కోరారు.
అలాగే సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న కార్మికుల క్లెయిమ్లను వెంటనే పరిష్కరించాలని, రైతాంగం మాదిరిగానే భవన నిర్మాణ కార్మికులకు కూడా సహజ మరణానికి రూ.5 లక్షల బీమా సౌకర్యం ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్మిక హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ, తీవ్రమైన వేసవి ఎండల దృష్ట్యా లేబర్ అడ్డాలలో కార్మికులకు నీడ కోసం షెల్టర్లు, సురక్షితమైన మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు. ఈ న్యాయమైన డిమాండ్ల సాధనకై రాష్ట్ర లేబర్ కార్యాలయం ముందు జరిగే ప్రదర్శన, ధర్నా కార్యక్రమంలో భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం మండల నాయకులు ఏదులాపురం రాజు, పొరండ్ల కనకమ్మ, రాజమ్మ, నాగరత్నమ్మ, లలిత, భవాని, పట్టా ప్రసాద్, నర్సమ్మ పాల్గొన్నారు.