రుద్రంపూర్, జూన్ 09 : కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో “పచ్చిరొట్ట పైర్లు – ఉపయోగాలు” అనే అంశంపై అవగాహన కార్యక్రమం అల్లపల్లి మండలం రాయపాడు గ్రామ పంచాయతీలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 60 మంది రైతులు పాల్గొన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కేవీకే ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ డా.టి.భరత్ మాట్లాడుతూ.. ప్రధాన పంటలు సాగు చేసే ముందు పచ్చిరొట్ట పైర్లను సాగు చేయడం ద్వారా భూసారం పెరిగి అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని తెలిపారు. రైతులు తప్పనిసరిగా మట్టి పరీక్షలు చేయించుకొని, వాటి ఫలితాల ఆధారంగా అవసరమైన మోతాదులోనే ఎరువులను వినియోగించాలని సూచించారు. పోటీ తత్వంతో మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల భూసారం తగ్గిపోతుందని హెచ్చరించారు.
మార్కెట్లో డిమాండ్ ఉన్న వరి రకాలను సాగు చేయాలని సూచించిన ఆయన, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన డబ్ల్యూజీఎల్-44 (సిద్ధి), కేఎన్ఎం-1638 వంటి వరి రకాలు అధిక దిగుబడులను అందిస్తాయని తెలిపారు.
ఉద్యాన శాస్త్రవేత్త శివ మాట్లాడుతూ, కృషి విజ్ఞాన కేంద్రం రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, శిక్షణా కార్యక్రమాలు, వాతావరణ సమాచారం, పంటల యాజమాన్యం, చీడపీడల నివారణ వంటి అంశాలపై నిరంతరం అవగాహన కల్పిస్తోందని చెప్పారు.
రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబించి ఆయిల్ పామ్, మునగ, పందిరి విధానంలో తీగజాతి కూరగాయల సాగు చేపట్టడం ద్వారా స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు. అనంతరం కేవీకే ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఖేతి బచావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా మట్టి నమూనా సేకరణ విధానాన్ని రైతులకు ప్రదర్శించారు. అలాగే గిరిజన ఉప ప్రణాళిక పథకం కింద 60 మంది రైతులు, మహిళా రైతులకు నాణ్యమైన కేఎన్ఎం-1638 వరి విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, మహిళా రైతులు, కేవీకే సిబ్బంది పాల్గొన్నారు.

‘పచ్చిరొట్ట పైర్ల సాగుతో భూసారం పెంపు’