టేకులపల్లి, ఏప్రిల్ 22 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని కొత్తతండా జి గ్రామ పంచాయితీ సమీపంలో ఉన్న సాయమ్మ చెరువులో గత నెల రోజులుగా అక్రమంగా మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువులో నుండి భారీగా మట్టిని తోడి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామస్తుల వివరాల ప్రకారం.. కొంతమంది అక్రమదారులు ప్రజాప్రతినిధుల అండదండలతోనే ఈ మట్టి రవాణా నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ఇతర అవసరాలకు మట్టి అవసరాన్ని ఆసరా చేసుకుని ఒక్కో ట్రాక్టర్కు రూ.400 నుండి రూ.500 వరకు వసూలు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ అక్రమ తవ్వకాల వల్ల చెరువు ఆకృతి దెబ్బతినడంతో పాటు భవిష్యత్లో ప్రమాదాలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి అక్రమ మట్టి తవ్వకాలను అరికట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై టేకులపల్లి తాసీల్దార్ ఎల్.వీరభద్రంను వివరణ కోరగా మట్టి రవాణాకి ఎటువంటి అనుమతి ఇవ్వలేదని, మట్టి రమణపై ఏ విధమైన ఫిర్యాదు రాలేదని, అక్రమ మట్టి రవాణా చేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.