– పట్టించుకోని అధికార యంత్రాంగం
బూర్గంపహాడ్, జూలై 14 : బూర్గంపహాడ్ మండలంలో ఇసుక అక్రమ రవాణా యధేచ్ఛగా సాగుతోంది. మండల పరిధిలోని బుడ్డగూడెంతో పాటు సారపాక బ్రిడ్జి కింద అక్రమార్కులు ఇసుక రవాణాను జోరుగా సాగిస్తున్నారు. ఒక పక్క గోదావరి వరద వస్తున్నప్పటికీ పట్టపగలే ఈ అక్రమ రవాణాకు తెరలేపారు. గోదావరి, కిన్నెరసాని వాగు పరిధిలో అక్రమార్కులు ట్రాక్టర్లలో ఇసుకను లోడ్ చేసి యధేచ్ఛగా వ్యాపారం సాగిస్తున్నా సంబంధిత రెవెన్యూ, పోలీసు యంత్రాంగం కన్నెత్తి కూడా చూడటం లేదనే విమర్శలు వినవస్తున్నాయి. అంతేకాకుండా అధికారిక ఇసుక ర్యాంపుల్లో అనధికారికంగా జీరో దందా నడుపుతున్నారన్న ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇసుకను చేతులతో లేదా పరిమితంగా తీయాల్సి ఉండగా ర్యాంపుల్లో భారీ యంత్రాలను ఏర్పాటు చేసి అనుమతులకు మించి లోతుతో ఇసుక తోడుతూ ఈ వ్యాపారం సాగిస్తున్నారు.
ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి పలుమార్లు మీడియా, సోషల్ మీడియాల్లో ప్రచురిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. అధికార పార్టీలో కొందరు తమ రాజకీయ పలుకుబడితో అక్రమ ఇసుక దందా కొనసాగిస్తున్నట్లు మండలంలో ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా మండలంలోని సారపాకతో పాటు బుడ్డగూడెంలో అక్రమ ఇసుక రవాణాపై సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు మండిపడుతున్నారు.