- మండు వేసవిలోనూ చల్లని ఆహ్లాదం
– బాటసారులకు కనువిందు చేస్తున్న పూల వనాలు
– నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ సంకల్పం.. నేడు పర్యావరణ పరిమళం
జూలూరుపాడు, ఏప్రిల్ 07 : దూరదృష్టితో నాటిన మొక్క.. నేడు బాటసారులకు చల్లని రక్షణ కవచమైంది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమం జూలూరుపాడు మండలంలో అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. ఒకప్పుడు ఎండ తీవ్రతతో సెగలు కక్కే రహదారులు, నేడు పచ్చని చెట్లతో నిండి అడవిని తలపిస్తున్నాయి.
సుమారు 15 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా మారి బాటసారులకు చల్లని నీడను, స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన ఈ బృహత్తర యజ్ఞం వల్ల మండల పరిధిలోని రహదారులన్నీ ఇప్పుడు పచ్చని పందిళ్లుగా మారాయి. మండు వేసవిలో సైతం ఈ మార్గంలో ప్రయాణిస్తుంటే ప్రకృతి ఒడిలో ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతోందని ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జూలూరుపాడు బాటకు ‘హరిత’ తోరణం
కేవలం ప్రధాన రహదారులే కాకుండా జూలూరుపాడు మండల వ్యాప్తంగా పచ్చదనం వెదజల్లుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ స్థలాలు, చెరువు గట్ల వెంట నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్నాయి. పడమటి నర్సాపురం నుండి కాకర్ల మీదుగా అనంతారం వరకు ఈ రహదారి వెంబడి ఉన్న చెట్లు ప్రయాణికులకు అలసట తెలియకుండా చేస్తున్నాయి. గురువాగుతండా నుండి మాచినేనిపేట గ్రామం మీదుగా కొమ్మగూడెం వరకు పెరిగిన చెట్లను చూస్తుంటే నాటి ప్రభుత్వం పర్యావరణంపై పెట్టిన శ్రద్ధ అర్థమవుతుంది. జూలూరుపాడు నుంచి గుండెపుడి మీదుగా రామచంద్రపురం, అనంతారం, గంగారంతండా, గాంధీనగర్ వరకు కిలోమీటర్ల మేర విస్తరించిన హరితహారం వృక్షాలు నేడు ప్రజలకు ఆస్తిగా మారాయి.
ఈ చెట్లలో నీడను ఇచ్చేవే కాకుండా వివిధ రకాల పూల మొక్కలు ఉండటం విశేషం. రంగురంగుల పూలతో వికసించిన ఈ వృక్షాలు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయి. నాటి ప్రభుత్వ సంకల్పం, అధికారుల కృషి, స్థానికుల సహకారం వెరసి జూలూరుపాడు మండలం నేడు హరిత శోభతో మెరిసిపోతోంది. ఈ మార్పు కేవలం సౌందర్యాన్నే కాకుండా, భూగర్భ జలాల పెరుగుదలకు, కాలుష్య నివారణకు ఎంతో దోహద పడుతోందని పర్యావరణవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.

జూలూరుపాడు బాటకు ‘హరిత’ తోరణం