కొత్తగూడెం: చండ్రుగొండ అటవీశాఖ అధికారి శ్రీనివాసరావు గోల్డ్ మెడల్ అందుకున్నారు. గురువారం హైదరాబాద్లోని దూలపల్లి ఫారెస్టు అకాడమీలో జరిగిన కార్యక్రమంలో ఈ మెడల్ వీరికి అందజేశారు. గత సంవత్సర కాలంలో చండ్రుగొండ, జూలూరుపాడు రేంజ్లలో ఉన్న అడవులను సమర్ధవంతంగా కాపాడినందుకు, అన్యాక్రాంతమైన 350 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని అటవీశాఖకు తీసుకొచ్చి వాటిలో విజయవంతంగా మొక్కలు పెంచారు. దీంతో పాటు వన్యప్రాణుల సంరక్షణ కోసం గడ్డిమైదానాలు, నీటి కుంటలు, రెండు రేంజ్ల పరిధిలో అటవీ నేరాల సంఖ్య తగ్గించినందుకు శ్రీనివాసరావుకు ఈ అవార్డు దక్కింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేఒక్క అటవీశాఖ అధికారికి దక్కుతుంది. ఇందులో భాగంగా ఈ ఏడాదికొత్తగూడెం జిల్లాకు చెందిన చండ్రుగొండ అటవీ అధికారి శ్రీనివాసరావుకు ఈ అవార్డు దక్కడం జిల్లాకు ఎంతో గర్వకారణం. కొత్తగూడెం జిల్లాకు ఈ అవార్డు రావడం పట్ల జిల్లా కన్జర్వేటర్ భీమా నాయక్, జిల్లా అటవీశాఖ అధికారి రంజిత్ నాయక్, ఎఫ్డీవో అప్పయ్యలు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలోని అటవీ అధికారులు శ్రీనివాసరావును ఆదర్శంగా తీసుకొని అటవీశాఖ అభివృద్దికి కృషి చేయాలని వారు కోరారు.