రుద్రంపూర్, మే 21 : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో వి.కె.సి.ఎం ప్రాజెక్టు ప్రభావిత, పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా పెనగడప గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో వైద్య నిపుణులు గ్రామ ప్రజలకు రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్) తదితర వ్యాధులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అలాగే ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ పలు సూచనలు చేశారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్య సంక్షేమానికి సింగరేణి సంస్థ కట్టుబడి ఉందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి వైద్య శిబిరాలను కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా హెల్త్ ఆఫీసర్ లలిత కుమారి మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపించి, నిరంతరం వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వి.కె.సి.ఎం ప్రాజెక్టు ఆఫీసర్ నరసింహ రావు మాట్లాడుతూ ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు సింగరేణి యాజమాన్యం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ ఆఫీసర్ విక్టర్, ఏఐటీయూసీ నాయకులు ఎం.ఆర్.కే ప్రసాద్, ఐఎన్టీయూసీ నాయకులు గోపు కుమార్, ఇతర వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.