బూర్గంపహాడ్, జూన్ 22 : అఖిల భారత కిసాన్ సభ ఇచ్చిన పిలుపులో భాగంగా పెంచిన ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని తాసీల్దార్ వద్ద సీపీఐ అనుబంధ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు సిద్దపు సుబ్బారెడ్డి, సీపీఐ మండల కార్యదర్శి సబ్కా నాగేశ్వరరావు, పేరాల శ్రీనివాసరావు, అలవాల సీతారామిరెడ్డి మాట్లాడుతూ కేంద్రం పెంచిన ధరలను తక్షణమే ఉప సంహరించుకోవాలని, రైతులు పండించిన ధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు చేసే బాధ్యత కేంద్రమే వహించాలని డిమాండ్ చేశారు. యూరియా యాప్ను రద్దుచేసి రైతు భరోసా మొత్తంగా ఒకే దఫాలో జూన్ 30లోగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని, ఈ విషయాన్ని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించి పంటల ఖర్చుకు ఉపయోగపడేలా అమలుచేయాలన్నారు.
నకిలీ విత్తనాలు, పురుగు మందులను విక్రయించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి శిక్షించాలని, పంటల రుణమాఫీ రూ.2 లక్షలకు పైగా చేయాలని, పంటల బీమా పథకాన్ని రూపొందించి అమలుచేయాలని, రైతులు పండించే ధాన్యానికి బోనస్ ఇవ్వాలని, గ్రామాల్లో వ్యవసాయ అధికారులు విస్తృతంగా పర్యటించి ఏ విత్తనాలు వేయాలి… ఏ సమయంలో ఏ పంట వేయాలో పూర్తిస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ కేఆర్కే ప్రసాద్కు నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు బర్ల వెంకటేశ్వర్లు, వీవీబీ చారి, దాసరి మల్సూర్, లోకిరెడ్డి శంకర్రెడ్డి, తోకల శ్రీను, కుంజా నాగరాజు, పుల్లయ్య పాల్గొన్నారు.